టాలీవుడ్ శ్రీమంతుడు.. రూ.500 కోట్ల భూమి దానం చేసిన తెలుగు విలన్

టాలీవుడ్ శ్రీమంతుడు.. రూ.500 కోట్ల భూమి దానం చేసిన తెలుగు విలన్
ఆయన సినిమాల్లో విలన్‌ వేషాలు వేసినప్పటికీ నిజ జీవితంలో మాత్రం హీరోలకే హీరో లాంటోడు. ఆయన పేరు ప్రభాకర్ రెడ్డి. పూర్తి పేరు మందాడి ప్రభాకర్ రెడ్డి. హీరోలు ఒకరిద్దరిని ఆదుకుంటేనే మా వాడు గొప్పోడు అంటూ అభిమానులు ప్రచారం చేసుకునే కాలమిది. కానీ అభిమాన సంఘాలు, భజన సంఘాలు లేని సమయంలో తనకంటే ఎక్కువ సంపాదించే హీరోలను మించి గొప్ప సాయం చేశారాయన. తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన సమయంలో హీరోలు స్టుడియోలు, సినిమా హాళ్లు కట్టుకోవడంలో బిజీ అయిపోయారు. అప్పడు తన భూమిని సినీ కార్మికులు ఇళ్లు కట్టుకునేందుకు దానం చేశారు. ఇప్పుడు ఆ స్థలంలోనే చిత్రపురి కాలనీ ఏర్పడింది. Also Read: సినిమాలనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న సినీ కార్మికులకు గూడు కల్పించాలన్న ఆలోచనతో ప్రభాకర్ రెడ్డి దానం చేసిన భూమి విలువ ఇప్పుడు అక్షరాలా 500 కోట్ల రూపాయలు. ఆయన చలవ వల్లే ఇప్పుడు సినీ కార్మికులంతా సొంతిళ్లలో ఉంటున్నారు. అందుకే మనం గొప్పగా చెప్పుకుంటూ అభిమానించే హీరోల కంటే ప్రభాకర్ రెడ్డి వెయ్యి రెట్లు గొప్పవారు. ఆయన సినిమాల్లో విలన్ కావచ్చు కానీ నిజ జీవితంలో మాత్రం హీరో. Also Read: ప్రభాకర్ రెడ్డి స్వస్థలం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి. ఎంబీబీఎస్ చదివిన ఆయన డాక్టర్ కావాల్సి యాక్టరయ్యారు. 1961లో ‘చివరకు మిగిలేది’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఆయన సుమారు 400కి పైగా సినిమాల్లో నటించారు. ఎక్కువ సినిమాల్లో విలన్‌గా నటించడంతో నిజజీవితంలోనూ ఆయన్ని అలాగే చూసేవారు. జయప్రద మూవీస్ పేరుతో కొన్ని సినిమాలు నిర్మించిన ఆయన.. కొన్ని కథలు కూడా సమకూర్చారు. Also Read: ఈ క్రమంలో ఆనాటి హీరోలకు ధీటుగా డబ్బులు సంపాదించారు. చిత్ర పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పటి హీరోలతో పాటు సినిమా ఇండస్ట్రీలో స్థిరపడిన చాలా మంది హైదరాబాద్‌లో స్థలాలు కొనుగోలు చేశారు. ప్రభాకర్ రెడ్డి కూడా వారితో పాటు గచ్చిబౌలి సమీపంలో పదెకరాల స్థలం కొన్నారు. అయితే, ఆనాటి హీరోలంతా హైదరాబాద్‌లోని తమ స్థలాల్లో విలాసవంతమైన ఇళ్లు, సినిమా హాళ్లు, సినీ స్టూడియోలు నిర్మించుకోగా... ప్రభాకర్ రెడ్డి మాత్రం తన స్థలాన్ని సినిమాలే జీవితంగా బతుకుతున్న సినీ కార్మికులకు దానంగా ఇచ్చారు. మద్రాస్‌లో ఉన్నప్పుడు కూడా ఆయన సినీ కార్మికులను సొంత మనుషుల్లా చూసుకునేవారు. ఎందరికో తన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చేవారు. పరిశ్రమ హైదరాబాద్‌కు వచ్చాక ఆయన సినీ కార్మికుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ సినీ కార్మికుల సమాఖ్యను ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా పనిచేశారు. హైదరాబాద్ మహానగరంలో సినీ కార్మికుల సగం సంపాదన ఇంటి అద్దెలకే పోతున్నందున వారికి సొంతిల్లు ఉంటే బాగుంటుందని అనుకుని తన పదెకరాల భూమిని దానం చేసేశారు. అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించి మరికొంత భూమి కూడా ఇప్పించారు. ఇలా సినీ కార్మికుల కోసమే చిత్రపురి కాలనీ ఏర్పాటైంది. ఇప్పుడు ఆ ప్రాంతం సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి వాటి మధ్యలో ఉంటుంది. ఈ కాలనీలో ఇళ్ల స్థలాల విలువ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఎకరం ధర కనీసం రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో ప్రభాకర్ రెడ్డి దానం చేసిన స్థలం విలువ ప్రస్తుతం రూ.500 కోట్లకు పైనే ఉంటుంది. ప్రభాకర్రెడ్డి చొరవ వల్ల చిత్రపురి కాలనీలో ఇళ్ల స్థలాలు పొందిన సినీ కార్మికులంతా ఇళ్లను నిర్మించుకొని ఇంటి అద్దెల బాధను తప్పించుకున్నారు. సంపాదించే డబ్బులతో కుటుంబాన్ని హాయిగా పోషించుకుంటున్నారు. తమ కోసం ఇంత చేసిన ప్రభాకర్ రెడ్డిని వారు ఎప్పటికీ మరిచిపోరు. అందుకే, ఆయనకు గుర్తుగా తమ కాలనీకి డాక్టర్ ఎం.ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీగా పేరు పెట్టుకున్నారు. 62 ఏళ్ల వయస్సులో 1997లో ప్రభాకర్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. సినిమాల కోసం, సినీ కార్మికుల కోసం ఇంత చేసిన ప్రభాకర్ రెడ్డికి ఎందుకో ఇండస్ట్రీలో దక్కాల్సినంత గౌరవం దక్కలేదనే చెప్పాలి. ప్రభాకర్‌రెడ్డికి సంబంధించిన ఈ సమాచారం ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ నటుడు చేసిన మహాదానానికి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ సమాచారాన్ని సోషల్‌మీడియా నుంచి తీసుకోవడం జరిగింది.


https://ift.tt/3jGTV9e taken from source: